వరలక్ష్మి వ్రతం
- శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. ఈ పూజలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా స్త్రీలు కొలుస్తారు. ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.
వ్రత ప్రారంభ ప్రార్థన శ్లోకం
- నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సుర పూజితే
- శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే
- తాత్పర్యం
- మహామాయారూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీ దేవి అష్త్టెశ్వర ప్రదాయిని. అష్ట సంపదల్ని అందించే జగన్మంగళదాయిని. అష్త్టెశ్వరాల్నీ కలగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీ దేవిగా మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించినవారికీ, కొలిచినవారికీ కొంగుబంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మి.
పురాణ కథ
- స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆది దేవుణ్ని కోరుతుంది. అప్పుడు శంకరుడు, గిరిజకు వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని వివరించాడని చెబుతారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్నీ ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి, అమ్మవార్ని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహా పతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు, గౌరికి విశదపరచాడని పురాణ కథనం. దాంతో పార్వతీ దేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి, వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని చెబుతారు.
పూజ విధానం
- తొలుత పసుపుతో గణపతిని చేసి పూజించి, కలశం లోనికి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేసి, షోడశోపచార పూజ, తరువాత అథాంగ పూజచేయవలెను.
- దాని తరువాత అష్టోత్తరశతనామ పూజతో నామాలను చదివి, దూప, దీప, నైవేద్యాలను తాంబూలాలని సమర్పించి, కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి, మంగళహారతి ఇచ్చి, తోరగ్రంథి పూజ చేసి, తోరబంధన మంత్రం పఠిస్తూ, ఆ నవసూత్రాన్ని కుడిచేతికి కట్టుకొనవలెను. నవకాయ పిండివంటలూ, పండ్లూ మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి.
- చివరగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువకు తాంబూలం సమర్పిస్తూ ఆమెని మహాలక్ష్మీగా భావించి వాయనమీయవలెను.
వరలక్ష్మీ వ్రత కథ
- పూర్వకాలంలో మగధ దేశంలోని కుండిన నగరంలో చారుమతి అనే సద్గుణవతి, భక్తిశ్రద్ధలు కలిగిన స్త్రీ ఉండేది. ఆమె తన భర్తను, అత్తమామలను ఎంతో ప్రేమతో, భక్తితో సేవిస్తూ ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపేది.
చారుమతి భక్తికి సంతోషించిన శ్రీ మహాలక్ష్మీ దేవి ఒకరోజు ఆమెకు స్వప్నంలో ప్రత్యక్షమయ్యారు.
“చారుమతీ! శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను వరలక్ష్మీ స్వరూపంగా భావించి భక్తిశ్రద్ధలతో పూజించు. నిన్ను పూజించిన వారికి సకల సౌభాగ్యాలు, ఐశ్వర్యాలు కలుగుతాయి” అని అమ్మవారు అనుగ్రహించారు.
ఉదయం నిద్రలేచిన చారుమతి తనకు వచ్చిన స్వప్నాన్ని భర్తకు, అత్తమామలకు, ఇరుగుపొరుగు స్త్రీలకు వివరించింది. అందరూ ఎంతో ఆనందించి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలని నిర్ణయించుకున్నారు.
శ్రావణ శుక్రవారం రోజున చారుమతి ఇంటిని శుభ్రం చేసి, పూజా స్థలాన్ని అలంకరించింది. కలశాన్ని ఏర్పాటు చేసి, దానిపై కొబ్బరికాయను ఉంచి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేసింది.
చారుమతి మరియు ఇతర స్త్రీలు భక్తితో అమ్మవారిని పూజించి, వ్రతకథను విని, తోరాన్ని ధరించారు. వారు అమ్మవారిని ప్రదక్షిణలు చేస్తుండగా ఒక అద్భుతం జరిగింది.
వారి పాదాలకు అందమైన బంగారు ఆభరణాలు, చేతులకు గాజులు, మెడలో హారాలు, శరీరంపై విలువైన వస్త్రాలు ప్రత్యక్షమయ్యాయి. వారి ఇళ్లలో ఐశ్వర్యం, సుఖసంతోషాలు వెల్లివిరిశాయి.
చారుమతి మరియు ఇతర స్త్రీలు ఇది వరలక్ష్మీ దేవి అనుగ్రహం అని భావించి అమ్మవారికి కృతజ్ఞతలు తెలిపారు. అప్పటి నుంచి స్త్రీలు శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించడం ఆనవాయితీగా మారిందని పురాణ కథనం.
వరలక్ష్మీ వ్రతం ఆచరించిన వారికి అష్టలక్ష్ముల అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ధనం, ధాన్యం, సంతానం, ఆరోగ్యం, సౌభాగ్యం, విజయంతో పాటు కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయని నమ్ముతారు.
🙏 వ్రత ఫలశ్రుతి
వరలక్ష్మీ దేవిని భక్తితో పూజించి, ఈ వ్రత కథను విని లేదా చదివిన స్త్రీలకు అమ్మవారి కృప లభించి, కుటుంబంలో ఐశ్వర్యం, ఆరోగ్యం, సౌభాగ్యం, సంతానాభివృద్ధి, సుఖశాంతులు కలుగుతాయని విశ్వసిస్తారు.
శ్రీ వరలక్ష్మీ దేవికి జై! 🙏
శ్రీ మహాలక్ష్మీ దేవికి జై! 🌺





Leave a Reply